December
29
2009

సినిమా నటులు తెలంగాణాని వ్యతిరేకించడానికి రియల్ ఎస్టేట్స్ వ్యాపారాలే కారణం

సినిమా నటులు తెలంగాణాని వ్యతిరేకించడానికి రియల్ ఎస్టేట్స్ వ్యాపారాలే కారణం. కోస్తా ఆంధ్ర రాజకీయ నాయకులకిలాగే సినిమా నటులకి కూడా హైదరాబాద్ శివార్లలో రియల్ ఎస్టేట్స్ వ్యాపారాలు ఉన్నాయి. భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్స్ వ్యాపారాలు చేసినవాళ్ళు కూడా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణా వస్తే హైదరాబాద్ శివార్లలో రియల్ ఎస్టేట్స్ భూముల ధరలు తగ్గిపోతాయి. అప్పుడు చాలా మంది సినిమావాళ్ళకి కూడా నష్టమే. మోహన్ బాబు, మురళీ మోహన్ వంటి సినిమా నటులు తెలంగాణాకి వ్యతిరేకంగా ప్రకటనలు చెయ్యడానికి కారణం ఇదే. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది. కర్నూలు కంటే హైదరాబాద్ లో సౌకర్యాలు ఎక్కువగా ఉండడం వల్ల తెలంగాణాని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి రాజధానిని హైదరాబాద్ కి మార్చారు. హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేసి ఆ నగరంలో కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల ప్రైవేట్ పరిశ్రమలు స్థాపించడం కూడా జరిగింది. ఇప్పుడు విశాఖపట్నం, విజయవాడలలో కూడా సౌకర్యాలు పెరిగాయి కానీ కోస్తా ఆంధ్ర రాజకీయ నాయకులకి హైదరాబాద్ లో ఉన్న తమ ఆస్తుల విలువ తగ్గడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళు ప్రత్యేక తెలంగాణాకి ఒప్పుకోవడం లేదు. ఈ లింక్ వీక్షించండి: http://thatstelugu.oneindia.in/feature/politics/2009/hyderabad-is-main-problem-291209.html

December
27
2009

తెలంగాణా ఎడారీకరణ

తెలంగాణాలో ఇరిగేషన్ ప్రొజెక్ట్ లు పూర్తి చెయ్యకపోవడం వల్ల తెలంగాణా ఎడారిగా మారబోతోంది. తెలంగాణాకి చెందినవాడు నీటి పారుదల శాఖ మంత్రి అయినా తెలంగాణాలో ఇరిగేషన్ ప్రొజెక్ట్ లు పూర్తవ్వడం లేదు. తెలంగాణా రైతులు బోర్లు తవ్వడానికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. రాంరెడ్డి అనే రైతు 56 బోర్లు తవ్వించాడు. అందులో 49 బోర్లు నుంచి నీరు రాలేదు. ఈ పరిస్థితిలో రైతులు బతకాలా? ఆత్మహత్యలు చేసుకోవాలా?

December
26
2009

జాతులు – స్వయం పరిపాలన

పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర ప్రాంతంలో గోర్ఖా జాతీయులు ఎక్కువ. వీరిది సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన జాతి. వీరి సంస్కృతి, ఆచారాలు కూడా భిన్నమైనవి. గోర్ఖాలు నేపాలీ బాష మాట్లాడుతారు. తాము హిందూ సన్యాసి గోరక్షనాథుని శిష్యులమని చెప్పుకుంటారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాల వల్ల గోర్ఖాలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో గంగా నది ప్రవహించే ప్రాంతాలు తప్ప ఏవీ అభివృద్ధి చెందలేదు. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాలు తప్ప వేరే ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందలేదో, పశ్చిమ బెంగాల్ లోని గంగా పరివాహక ప్రాంతాలు తప్ప వేరే ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందలేదు. పశ్చిమ బెంగాల్ లో కోచ్ జాతీయులు ఎక్కువగా ఉన్న కోచ్ బిహార్ జిల్లాని కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చెయ్యాలనే డిమాండ్ ఉంది. అస్సాంలో బోడోల కోసం బోడోలాండ్ రాష్ట్రాన్నీ, కర్బీల కోసం కర్బీ అంగ్లాంగ్ రాష్ట్రాన్నీ కూడా ఏర్పాటు చెయ్యాలనే డిమాండ్లు ఉన్నాయి. మన ఇండియన్ పాలకులు ప్రాంతాలని నిర్లక్ష్యం చేస్తున్నట్టే జాతులని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే కొన్ని చోట్ల జాతుల కోసం ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్లు వస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా డిమాండ్ ఉంది. 53 సంవత్సరాల నుంచి సమైక్యత అంటూ కబుర్లు చెపుతూ తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యకుండా ఉంచుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చెయ్యడం చేతకాకపోతే వెనుకబడిన ప్రాంతాలకి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వొచ్చు కదా? వెనుకబడిన జాతులని అభివృద్ధి చెయ్యడం చేతకాకపోతే ఆ జాతులు నివసించే ప్రాంతాలకి ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వొచ్చు కదా? కలిసి ఉంటే కలదు సుఖం అంటూ కబుర్లు చెప్పి ప్రాంతీయ అసమానతలూ, జాతుల అసమానతలని పరిష్కరించకుండా, ప్రాంతాలకీ, జాతులకీ ద్రోహం చేసి ఎవరిని ఉద్దరిస్తాం?

December
26
2009

చిదంబరంపై లగడపాటి అభిప్రాయం ఏమిటి?

December
25
2009

రాజ్ భవన్ ఉన్నది హైదరాబాద్ లోనా? యాదగిరిగుట్టలోనా?

రాజ్ భవన్ ఉన్నది హైదరాబాద్ లోనా? యాదగిరిగుట్టలోనా? ABN ఆంధ్రజ్యోతిలో బ్రాడ్కాస్ట్ అయిన ఈ వీడియో చూడండి

December
6
2009

కోస్తా ఆంధ్రులు తెలంగాణాకి వ్యతిరేకం కాదు

మెజారిటీ కోస్తా ఆంధ్ర ప్రజలు ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకి వ్యతిరేకం కాదు. హైదరాబాద్ లో కొంత మంది కోస్తా ఆంధ్ర భూస్వాములు బాగా ఆస్తులు సంపాదించారు. వాళ్ళలో తెలుగు దేశం, కాంగ్రెస్ నాయకులు ఎక్కువగా ఉన్నారు. భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్స్ వ్యాపారం చేసినవాళ్ళు కూడా ఉన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ లో ఆస్తులు సంపాదించిన కోస్తా ఆంధ్ర భూస్వాముల ఆస్తుల విలువ తగ్గిపోతుంది. అందుకే తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేక తెలంగాణాని వ్యతిరేకిస్తున్నాయి. మాకు హైదరాబాద్ లో ఎలాంటి ఆస్తులూ లేవు. హైదరాబాద్ లో ఆస్తులు సంపాదించాల్సిన అవసరం మాకు లేదు. హైదరాబాద్ ఆంధ్రా నుండి విడిపోవడం వల్ల మెజారిటీ కోస్తా ఆంధ్ర ప్రజలకి వచ్చే నష్టం ఏమీ లేదు. సమైక్యవాదం అంటూ తెలంగాణాకి ద్రోహం చెయ్యడం వల్ల లాభ పడేది హైదరాబాద్ లో ఆస్తులు సంపాదించిన వాళ్ళే కానీ ప్రాంతీయ ద్వేషం లేకుండా బతుకుతున్న మెజారిటీ ఆంధ్రులు కాదు. తెలంగాణాకి కొందరు తెలంగాణా మంత్రులే అడ్డు తగులుతున్నారు. ఉదాహరణకి సబితా ఇంద్రారెడ్డి. ఆమె జగన్ వర్గానికి చెందడమే అందుకు కారణం. సబితకి ఎలాంటి అర్హత లేకపోయినా రాజశేఖర రెడ్డి ఆమె భర్త పేరు చెప్పి ఆమెకి హోమ్ మంత్రి పదవి ఇచ్చాడు. ఆమె హోమ్ మంత్రి అయిన తరువాత రాష్ట్రంలో నేరాలు పెరిగాయి. అందులో మహిళలపై జరిగే యాసిడ్ దాడులు లాంటివే ఎక్కువ. అర్హత లేకపోయినా హోమ్ మంత్రి పదవి ఇచ్చినందుకే సబితకి రాజశేఖర రెడ్డి అంటే అభిమానం, ఆ అభిమానంతోనే ఆమె జగన్ వర్గంలో చేరింది. ఇలాగే రాజశేఖర రెడ్డి వల్ల వ్యక్తిగతంగా లాభపడిన మంత్రులు మరికొందరు ఉన్నారు. వాళ్ళందరూ జగన్ గ్రూప్ లో చేరి అతన్ని ముఖ్య మంత్రిని చెయ్యడానికి ప్రయత్నించినవాళ్ళే. జగన్ కి ప్రత్యేక తెలంగాణా రావడం ఇష్టం లేదు కాబట్టి జగన్ వర్గానికి చెందిన మంత్రులు తెలంగాణాకి సపోర్ట్ ఇవ్వరు. పైకి తెలంగాణాకి అనుకూలంగా మాట్లాడినా, లోపలలోపల సమైక్యవాదం వైపే ఉంటారు. వీరప్ప మొయిలీ కూడా రాజశేఖర రెడ్డి అభిమానే. అతని కొడుకు జగన్ కంపెనీలో పని చేస్తున్నాడు, అది కూడా చాలా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం. జగన్ కి ఇష్టం లేని పని వీరప్ప మొయిలీ చెయ్యడు. అందుకే వీరప్ప మొయిలీ తెలంగాణా విషయంతో కేంద్రానికి సంబంధం లేదంటూ ప్రకటన చేశాడు. గతంలో వీరప్ప మొయిలీ జగనే ముఖ్యమంత్రి అవుతాడనీ, రోశయ్య తాత్కాలిక ముఖ్యమంత్రే అనీ సోనియా పర్మిషన్ లేకుండా ప్రకటన చేశాడు. అతను మొదటి నుంచి రాజశేఖర రెడ్డి & జగన్ గ్రూపే. రోశయ్య గ్రూప్ లో ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువ. ధర్మపురి శ్రీనివాస్, జానారెడ్డి లాంటి కొద్ది మంది మాత్రమే రోశయ్య గ్రూప్ లో ఉన్నారు. ఒకవేళ తెలంగాణా రాష్ట్రం రాకపోతే అందుకు ప్రధాన కారణం జగన్ గ్రూపే అవుతుంది. తెలుగు దేశం, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకీ తెలంగాణా రాష్ట్రం రావడం ఇష్టం లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికీ, జగన్ వర్గానికీ ఇష్టం లేదు. వీళ్ళ అభిప్రాయాలు మెజారిటీ కోస్తా ఆంధ్రుల అభిప్రాయాలు కావు.

November
5
2009

డబ్బున్న వాళ్ళ పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో, పేద వాళ్ళ పిల్లలు తెలుగు మీడియంలో

దేశంలో ఇంగ్లిష్ నేర్చుకున్న వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అని అందరికీ తెలుసు. నేనేమీ ఇంగ్లిష్ మీడియం బోధనకి వ్యతిరేకం కాదు కానీ డబ్బున్న వాళ్ళ పిల్లలకి విద్యా బోధనలో ఒక రకమైన ప్రమాణాలు, పేద వాళ్ళ పిల్లలకి వేరే రకమైన ప్రమాణాలు విధానానికే నేను వ్యతిరేకం. “పొద్దు“లో తెలుగు మీడియం విద్యా బోధన గురించి చర్చ జరిగింది. చర్చలో భాగంగా తెలుగు మీడియం టీచర్లు కూడా తమ పిల్లలని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నారో చెప్పాను. ఆ సమాధానానికి చర్చతో సంబంధం లేదని అబద్దం చెప్పి నా సమాధానాలు డిలీట్ చేశారు.

“ప్రభుత్వ టీచర్లు కూడా తమ పిల్లలని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళకే పంపిస్తున్నారు. తెలుగు వస్తే ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. హిందీ లేదా ఇంగ్లిష్ వస్తే దేశంలో ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఉద్యోగానికి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. అందు కోసం రెండు మూడు బాషలు నేర్చుకోవాలి కూడా. అందుకే నేను తెలుగు మెడియం కాకుండా హిందీ లేదా ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ ఉండాలంటున్నాను.”

ఈ సమాధానం వాళ్ళకి చర్చతో సంబంధం లేని సమాధానంలా కనిపించిందట! ఇది డిలీట్ చెయ్యకపోయినా, తరువాత వ్రాసినవి డిలీట్ చెయ్యడం జరిగింది. ఇక్కడ కత్తి మహేష్, కెక్యూబ్ వర్మ గారు మాత్రమే నిజాలు మాట్లాడారు. కెక్యూబ్ వర్మ గారు స్కూళ్ళలో పాటించే ప్రమాణాల గురించి మంచి ప్రశ్నలు వేశారు. పిల్లల మెడలో బోర్డులు తగిలించిన స్కూల్ క్రైస్తవ స్కూల్ కాబట్టే ఆ స్కూల్ మీద అంత విరిచుకుపడ్డారు. పిల్లల మెడలో బోర్డులు కట్టడం తప్పే కానీ ఇందులో తల్లితండ్రుల తప్పు కూడా ఉంది. స్కూల్ లో టీచర్లు పాటించే పనిష్మెంట్ విధానం గురించి ఆలోచించే తల్లితండ్రులు ఇండియాలో తక్కువ. టీచర్లు పిల్లల చేతులు వాచిపోయేలా కర్రతో కొట్టినా ఫర్వా లేదు, పిల్లలకి చదువు వస్తే చాలు అనుకుంటారు కానీ అది పిల్లల హక్కుల ఉల్లంఘన అవుతుంది అనుకోరు. పోలీసులు నేరస్తుల మెడలో బోర్డులు కట్టినట్టు పిల్లల మెడలో బోర్డులు కట్టడం పిల్లలని అవమానించడమే. ఇక్కడ పిల్లలకి జరిగిన అవమానం గురించి ఎక్కువ బాధ పడకుండా తెలుగుకి జరిగిన అవమానం గురించి ఎక్కువ బాధ పడుతున్నారు. తెలుగుకి జరిగిన అవమానం గురించిన చర్చలో కేవలం అవమానం గురించి మాట్లాడారా? అనవసరంగా మత ప్రస్తావన తెచ్చి క్రైస్తవ, ఇస్లాం మతాల పైన విమర్శలకి తెలుగు అంశాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. తెలుగు మీడియం టీచర్లు తమ పిల్లలని ఇంగ్లిష్ మీడియం స్కూళ్ళకి ఎందుకు పంపిస్తున్నారో చెపితే అది చర్చకి సంబంధం లేని విషయం అట! మత ప్రస్తావన తీసుకురావడం మాత్రం చర్చకి అవసరమైన విషయమేనట! క్రైస్తవ స్కూళ్ళలోనే కాదు, హిందువులు నడిపే స్కూళ్ళలో కూడా తెలుగు మాట్లాడే స్టూడెంట్స్ ని కర్రలతో కొట్టడం లాంటివి చేస్తారు. ఇక్కడ పనిష్మెంట్ విధానాన్ని విమర్శించాలి కానీ మతాన్ని విమర్శించడం వల్ల ఏమి ప్రయోజనం?